ఏపీలో టీచర్లకు అలర్ట్.. ఆ ప్రచారాన్ని నమ్మొద్దు, అసలు సంగతి ఇదంటూ ట్వీట్

by సూర్య | Wed, Jul 10, 2024, 09:23 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల అటెండెన్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టీచర్లు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయాలంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు ఓ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు.. ఏపీలో టీచర్లకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయని టీచర్లపై చర్యలు తీసుకునేందకు సమాయత్తం అవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రచారంపై.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. టీచర్ల అటెండెన్స్‌కు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఇది అవాస్తవం అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇచ్చింది.


అలాగే టీడీపీ కూడా ఇదే అంశంపై స్పందించింది. 'ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఉత్తర్వులు ఏదీ ఇవ్వలేదు.. గతంలో ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తెచ్చి, ఉపాధ్యాయులని పీక్కుతింది వైఎస్ జగన్. తనని ఓడించిన ఉపాధ్యాయులపై, తాడేపల్లి కొంపలో కూర్చుని, ఫేక్ చేస్తూ, ఈ రకంగా తన సైకోతనం చూపిస్తున్నాడు' అంటూ ట్వీట్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని టీచర్లు నమ్మొద్దని కోరారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని ఆదేశించారు. అంతేకాదు టీచర్లపై అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించి.. వారు ప్రధానంగా బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. గతంలో మాదిరిగా టీచర్ల బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా విధివిధానాలు రూపొందించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అంతేకాదు బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు మంత్రి లోకేష్. అంతేకాదు పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలపైనా ఫోకస్ పెట్టారు. గతంలోనే ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంపై టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. సాంకేతికపరిగా సమస్యలు ఎదురుకావడంతో వారు ఈ విధానాన్ని తీసేయాలని కోరారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM