by సూర్య | Fri, Apr 26, 2024, 03:18 PM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీ లో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోదీ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు.కాగా ప్రధాని మోదీ రాష్ట్రంలో రోడ్షోలు, బహిరంగ సభల నిర్వహణకు వేదికల ఖరారుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం జోరు పెంచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. కాగా, ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రెండు రోజులపాటు విస్తృత స్థాయి పర్యటనలు చేయనున్నారు. మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది.ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా, ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని నేతలు భావిస్తున్నారు. ప్రధాని పర్యటించే రెండు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రూపొందించడంపై కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు. మోదీ పర్యటన అనంతరం, కేంద్రం నుంచి మరికొందరు నేతలు ఏపీలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Latest News