సీఎం జగన్‌పై దాడి కేసు: రంగంలోకి డ్రోన్లు.. అక్కడ నుంచే రాయి విసిరాడా

by సూర్య | Sun, Apr 14, 2024, 04:20 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. అజిత్ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పైనుంచి రాళ్లు రువ్వినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడి జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే నిర్వహించారు. దీని ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.


వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుడివైపున నివాసాలు ఉండటంతో ఎడమవైపున స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. రాత్రి వేళ కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించకుండా.. 30 అడుగుల దూరం నుంచి దాడి చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు. మరోవైపు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో వేలిముద్రలను కూడా సేకరించినట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అజిత్‌ సింగనగర్ పోలీసులకు వైద్య నివేదిక అందింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు పోలీసులు. దీని ఆధారంగా కేసు నమోదుచేయనున్నారు.


కాగా, ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు సీఎం జగన్ శనివారం రాత్రి హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంటిపై గాయానికి రెండు కుట్లు వేసిన వైద్యులు.. రెండు రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాడి సమయానికి ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. దాడి సమయంలో సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి గాయమైంది.


కాగా, సీఎం జగన్‌పై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. నారా చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడని, జగన్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక దాడులకి ఒడిగట్టారని ఆరోపించారు. దీనిని కమిషనర్, సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. మరోవైపు, సీఎం జగన్‌ దాడి ఘటనపై ఈసీ తీవ్రంగా స్పందించింది. దీనిపై నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సంఘానికి సీసీ కాంతి రాణా నివేదికను అందజేయనున్నారు.

Latest News

 
హృదయవిదారక ఘటన.. ప్లాస్టిక్ కవర్‌లో పసిబిడ్డ Sun, Jun 15, 2025, 11:15 AM
సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు వరుస సెలవుల అడ్డంకి Sun, Jun 15, 2025, 09:39 AM
నేడు కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ Sun, Jun 15, 2025, 09:34 AM
వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగత ఆర్ధిక సాయం చెక్కు పంపిన పవన్ కల్యాణ్ Sun, Jun 15, 2025, 09:28 AM
వైసీపీ శ్రేణులతో మాట్లాడేందుకు పొదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి Sun, Jun 15, 2025, 09:02 AM