by సూర్య | Fri, Apr 12, 2024, 06:22 PM
అనకాపల్లి జిల్లాలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. శుక్రవారం ఉదయం కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజ్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముస్లిం కుటుంబానికి చెందిన గౌస్(12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సు బీభత్సం ధాటికి టిఫిన్ వాహనంతో పాటు కారు, నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయిన బాలుడి కుటుంబీకులు పెందుర్తి నుంచి పిఠాపురంకు కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ఆగారు. కాసేపటికే అనుకోని దుర్ఘటనతో బాలుడి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రంజాన్ మరుసటి రోజే ప్రమాదం జరగడంతో మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సంఘటనా స్థలానికి కసింకోట సీఐ వినోద్ బాబు, పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News