by సూర్య | Wed, Oct 05, 2022, 04:01 PM
గస్తీ కోసం వినియోగించే ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ఈ హెలికాప్టర్.. ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో పైలట్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నట్టు ఆర్మీ ప్రకటించింది.
చీతా రకం హెలికాప్టర్లను భారత ఆర్మీ గస్తీ కోసం వినియోగిస్తుంటుంది. అదే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో రోజువారీ గస్తీ కోసం బుధవారం ఉదయం ఇద్దరు పైలట్లతో చీతా హెలికాప్టర్ బయలుదేరింది. తవాంగ్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఉదయం 10 గంటల సమయంలో ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్మీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిపై పరిశీలన జరుపుతున్నట్టు ఆర్మీ వెల్లడించింది.
Latest News