by సూర్య | Thu, Sep 22, 2022, 08:40 PM
జోడు ఉద్యోగాలు చేసే తమ సంస్థ ఉద్యోగులపై విప్రో సంస్థ కన్నెరజేసింది. ఓ సంస్థలో ఉద్యోగానికి చేరి... ఆ సంస్థకు తెలియకుండా ఇంకో సంస్థకు కూడా పనిచేసే సరికొత్త విధానం మూన్ లైటింగ్. ఇప్పుడీ విధానమే విప్రోలో 300 మంది ఉద్యోగులపై వేటు పడేలా చేసింది. తమ సంస్థలో ఉద్యోగానికి చేరి..ఆ సంస్థ అనుమతి లేకుండా వేరే కంపెనీలకు కూడా ఈ 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా విప్రో గుర్తించింది. ఆ వెంటనే వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ బుధవారం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ స్వయంగా వెల్లడించారు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉద్యోగుల పనివేళల్లో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం హోం పధ్ధతి అమలులోకి వచ్చింది. ఈ పధ్ధతిలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు... తాము పనిచేస్తున్న సంస్థలకు తెలియకుండా ఖాళీ సమయాల్లో ఇతర సంస్థలకూ పనిచేయడం మొదలుపెట్టారు. ఈ పద్ధతినే మూన్ లైటింగ్ అని పిలుస్తున్నారు. దీనిని గుర్తించిన కంపెనీలు తమ ఉద్యోగులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా తమ ఉద్యోగులకు మూన్ లైటింగ్పై విప్రోతో పాటు ఇన్ఫోసిస్, ఐబీఎం సంస్థలు జారీ చేశాయి. మూన్ లైటింగ్కు పాల్పడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని ప్రకటించాయి. ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 300 మంది విప్రో ఉద్యోగులు ఇతర సంస్థలకు కూడా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ గుర్తించింది. ఇదివరకే జారీ చేసిన హెచ్చరికల మేరకు 300 మంది ఉద్యోగులపై విప్రో తాజాగా వేటు వేసింది.
Latest News