కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న మరాట్వాడ గులాబీ నేతలు,,,,ఎన్సీపీలో విలీనం వార్తలు

byసూర్య | Tue, Oct 01, 2024, 06:39 PM

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి.. ప్రస్తుత రాజకీయాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి.. ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే.. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవటం గమనార్హం. టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు నడుం బిగించిన గులాబీ బాస్ కేసీఆర్.. బీఆర్ఎస్‌గా పేరు మార్చారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామంటూ.. అటు ఏపీలో.. ఇటు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.


ముఖ్యంగా.. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్.. మూడు నాలుగు బహిరంగ సభలు కూడా నిర్వహించి.. సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకుని.. మంచి కేడర్‌ని కూడగట్టుకున్నారు. అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికల్లోనూ ఒకట్రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరేశారు కూడా.


కట్ చేస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అందుకు కారణాలేవైనా.. మహారాష్ట్రలో పార్టీని మాత్రం గాలికి వదిలేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను కూడా గులాబీ బాస్ పట్టించుకోకపోవటంతో.. ఇప్పుడు ఆ మరట్వాడ గులాబీ శ్రేణులు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.


శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం కానుందన్న వార్తలకు బలం చేకూరుస్తూ.. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్ రావుతో సహా పార్టీ ముఖ్య నేతలు శరద్ పవార్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు శరద్ పవార్‌తో భేటీ తర్వాత.. అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో బీఆర్ఎస్‌ను విలీనం చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


మరి ఈ ఊహించని పరిణామంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సమాచారం ఉందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఉన్నప్పటికీ.. ఇటు తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా.. మహారాష్ట్రపై పోకస్ పెట్టటం కష్టమని వదిలేశారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి.. ఈ విలీనంపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.


Latest News
 

గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM