byసూర్య | Sun, Jun 16, 2024, 04:45 PM
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అగ్ని ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా... వికారాబాద్ జిల్లా చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (జూన్ 15) రాత్రి కలకలం రేపింది. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
హఠాత్పరిణామంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. అందరూ బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం డయాలసిస్ కేంద్రానికి సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి 7:30 గంటలకు అందులో నుంచి ఒక్కసారిగా మంటలు, పొగ రావడం చూసి ఆసుపత్రిలో ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. పక్క వార్డుల్లో ఉన్న రోగులు, సిబ్బంది సైతం బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంటల దాటికి డయాలసిస్ కేంద్రంలోని మెడికల్ సామాగ్రి కాలిబూడిదైంది.