byసూర్య | Mon, May 06, 2024, 07:42 PM
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరి నుంచి బలమైన నాయకులు బరిలోకి దిగారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి వంటి నేతలు పోటీపడుతున్నారు. వీరిని ఎదుర్కొనేందుకు పలువురు సామాన్యులు కూడా స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వారిలో ఒకరే వీధి వ్యాపారం చేసుకునే చిరిపిరెడ్డి రమేష్. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు గాను ఆయన ఎన్నికలను అస్త్రంగా ఎంచుకున్నారు. తనలాంటి వారికి మద్దతుగా నిలిచేందుకు మాల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
చిరిపిరెడ్డి రమేష్ ఓ చిరు వ్యాపారి. హైదరాబాద్ చైతన్యపురి ప్రధాన రహదారి పక్కన ఫుట్పాత్పై టిఫిన్ సెంటర్ నడిపించేవారు. అయితే గత నెల క్రితం పోలీసులు పుట్పాత్లపై చిరు వ్యాపారాలను తొలగించారు. పోలీసుల చర్య ద్వారా దాదాపు 1000 మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. అందులో రమేష్ కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పలువురు రాజకీయ నాయకులను కలిసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో జరిగిన అన్యాయంపై ఎన్నికలను అస్త్రంగా ఎంచుకున్నారు.
'నేను 2011లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ వచ్చాను. ఉద్యోగం రాకపోవటంతో చైతన్యపురి ఫుట్పాత్లో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ను ప్రారంభించాను. ఆ తర్వాత నేను ఆరుగురికి ఉపాధి కల్పించాను. తమకు కావాల్సిన అనుమతులు, లైసెన్సులు ఉన్నప్పటికీ టిఫిన్ సెంటర్ ఖాళీ చేయించారు. తనపై ఆధారపడిన ఆరుగురు ఉపాధిని కోల్పోయారు. అందుకే ఎన్నికల బరిలో నిలిచా.' అని రమేష్ వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అతని వద్ద రూ. 50 వేల నగదు మాత్రమే ఉంది. ఉన్న ఆ డబ్బుతోనే ప్రచారం చేస్తున్నానని.. తన ప్రచారానికి స్నేహితులు, బంధువులే నిధులు సమకూరుస్తున్నారని చెప్పారు. యువత నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ఉండటానికి ప్రభుత్వం తనలాంటి చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలని రమేష్ కోరుతున్నారు.