ప్రతిసారీ మా ఫొటోలే ఎందుకు మిస్సవుతున్నాయి.. గద్వాల విజయలక్ష్మి వాట్సాప్ చాట్ వైరల్

byసూర్య | Sat, May 04, 2024, 07:36 PM

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు.. బీఆర్ఎస్ పార్టీలోని నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుండగా.. అందులోకి వెళ్లిన నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. అది కూడా ప్రొటోకాల్ విషయంలో. ప్రచార ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కొందరు నేతలు మూతి ముడుచుకుంటున్నారు. ఈ ప్రొటోకాల్ సమస్య వచ్చింది ఎవరికో కాదండి.. స్వయంగా హైదరాబాద్ మేయర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి విషయంలో. పార్టీ ప్రచార ఫ్లెక్సీల్లో తన ఫోటోలు ప్రింట్ చేయకపోవటంపై విజయలక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా.. అందుకు సంబంధించిన ఓ వాట్సప్ గ్రూప్‌లో నడిచిన చాటింగ్ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి.


అసలు విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో.. ఆయనకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలను.. "సికింద్రాబాద్ పార్లమెంట్" పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఆ ఫ్లెక్సీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఫొటోలు ప్రింట్ చేయలేదు.


ఆ విషయాన్ని గమనించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. గ్రూపులోనే తనదైన శైలిలో స్పందించారు. "మీ ప్రోటోకాల్‌లో, ప్రచార ఫ్లెక్సీల్లో ప్రతిసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు ఎలా మిస్ అవుతున్నాయి..? మేం వేరే పార్టీలో ఉన్నామా..?" అని విజయలక్ష్మి అదే గ్రూప్‌లో ప్రశ్నించారు. అయితే.. ఆమె పెట్టిన మెస్సేజులను గమనించిన గ్రూప్ అడ్మిన్.. ఫ్లెక్సీ ఫొటోతో పాటు ఆమె పెట్టిన మెస్సేజులను కూడా డిలీజ్ చేశారు.


అయితే.. ఈ వాట్సప్ చాటింగ్‌ను ఎవరో స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మెస్సేజులు పెట్టినప్పటి స్కీన్ షాట్లు.. వాటిని డిలీట్ చేసిన తర్వాత తీసిన స్క్రీన్ షాట్లు.. రెండింటినీ సోషల్ మీడియాలో పెట్టగా అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలను ప్రత్యర్థులు షేర్ చేస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలున్నాయని.. ఐక్యత లేదని ఆరోపిస్తున్నారు.  అయితే.. దానం నాగేందర్‌తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత.. ఈ ముగ్గురూ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా.. వీళ్ల మధ్యే విభేదాలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.



Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM