byసూర్య | Wed, Sep 20, 2023, 07:31 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలనే కనికరం లేకుండా ఓ కోడలు తన అత్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. చీపురు తిరగేసి ఇష్టం వచ్చినట్లు కొట్టింది. దెబ్బలకు తట్టుకోలేక వృద్ధురాలు గట్టిగా ఏడ్చినా.. ఆ కోడలు కనికరం చూపలేదు. వృద్దురాలి 'గుండె' కందిపోయేలా దాడి చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇంటి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి సెల్ఫోన్లో బంధించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన వారు కోడలు కర్కషత్వంపై మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. లక్ష్మమ్మ భర్త గతంలో మృతి చెందగా.. ఇద్దరు కుమారుల వద్ద వంతుల వారీగా ఉంటుంది. ఒక నెల పెద్ద కుమారుడి వద్ద మరో నెల చిన్న కుమారుడి వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తోంది. అయితే భువనగిరి పట్టణంలో ఉండే పెద్ద కోడలు పద్మ వృద్ధురాలిని చీదరించుకునేది. తన వంతు వచ్చిన ప్రతిసారీ ఆమెను సూటిపోటి మాటలతో తిడుతూ ఉండేది. కొన్నిసార్లు చేయి కూడా చేసుకునేది.
కొన్ని రోజుల క్రితం చిన్న కుమారుడి ఇంటి నుంచి పెద్ద కుమారుడి ఇంటికి లక్ష్మమ్మ వెళ్లింది. అయితే వృద్ధురాలు అనే కనికరం లేకుండా కోడలు పద్మ లక్ష్మమ్మపై దాడి చేసింది. చీపురుతో విచక్షణారహితంగా దాడి చేసింది. తనను కొట్టొద్దని వృద్ధురాలు వేడుకున్నా వినలేదు. దెబ్బలకు తట్టుకోలేక గట్టిగా ఏడ్చినా.. ఆ కోడలు గుండె కరగలేదు. కాళ్లు, చేతులపై ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అది గమనించిన కొందరు స్థానికులు వీడియో తీశారు. ఓ మహిళ దగ్గరకు వెళ్లి కొట్టొద్దని చెప్పినా వినకుండా దాడి చేసింది. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు.. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పిల్లల్ని పెంచి పోషించి వారిని ఓ ఇంటివాళ్లను చేస్తే.. వృద్ధురాలికి పట్టెడన్నం పెట్టలేక ఇలా దారుణంగా హింసించటంపై పలువురు మండిపడుతున్నారు.