byసూర్య | Mon, Oct 25, 2021, 03:49 PM
తెలంగాణలో మరోసారి భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గ్రేహౌండ్స్-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందుతోంది. ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించినట్లు జిల్లా పోలీసు అధికారులు నిర్ధారించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండే జిల్లాగా చెప్పుకొనే ములుగులో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకుంటోన్న జిల్లా ఇది. ఛత్తీస్గఢ్కు ఆనుకుని ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల్లోని దట్టమైన అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ వైపు వాజేడు, వెంకటాపురం-ఛత్తీస్గఢ్ వైపున ఉన్న బోమెడ్, చిన్నౌట్లీల్లో విస్తరించివున్న దట్టమైన అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గ్రేహౌండ్స్ అక్కడ కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు ఆరంభం అయ్యాయి. కొన్ని గంటల పాటు భీకర ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ ఘటనలో ఒక నక్సలైట్ మరణించాడని చెబుతున్నారు. అతణ్ని ముఛక్కి ఉంగల్ అలియాస్ రఘు, అలియాస్ సుధాకర్గా గుర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.