byసూర్య | Sat, Jan 18, 2020, 09:16 AM
-20 నుంచి 24 వరకు డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు
-పాల్గొననున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
-రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించనున్న ఐటీశాఖ మంత్రి
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రాత్రి (ఈ నెల 19న) స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరనున్నారు. కేటీఆర్ రెండోసారి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. 2018లో మొదటిసారి ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. 2019లో ఆహ్వానం వచ్చినా హాజరుకాలేదు. ఈ ఏడాది 50వ వార్షిక సమావేశాలు కావడంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.
సదస్సు నిర్వాహకుల ఆహ్వానం మేరకు.. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సమావేశాల్లో కేటీఆర్తోపాటు ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అధిపతులు, కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు, అధిపతులు ఈ సమావేశాలకు హాజరవుతారు.
ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో మంత్రి కేటీఆర్ భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం గురించి పారిశ్రామికవేత్తలకు వివరిస్తారు. ఈ నెల 24వ తేదీ రాత్రి ఆయన రాష్ర్టానికి తిరిగొస్తారు. డబ్ల్యూఈఎఫ్ సమావేశాల సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటుచేసి, తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.