by సూర్య | Tue, Jan 18, 2022, 08:08 AM
ఇద్దరు యువతులు ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో జరిగింది. పెళ్లైన తెల్లారే భర్తను వదిలేసిన యువతి తన ప్రేమికురాలితో వెళ్లిపోయింది. తమ జీవితానికి అడ్డువస్తున్నారని కుటుంబ సభ్యులపై ఆ యువతి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ధన్బాద్ లోని పురానా బజార్ కు చెందిన యువతికి దేవ్ఘర్ లో 2021, డిసెంబర్ 11న వివాహం జరిగింది. పెళ్లైన రెండో రోజే భర్తను వదిలేసి వెళ్లిపోయింది. మరో యువతితో తాను జీవించాలనుకుంటున్నానని చెప్పి వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి ఆ యువతులిద్దరూ మంచి స్నేహితులని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా చేస్తుందని తెలియదన్నారు. భర్తను వదిలేసి వచ్చిన క్రమంలో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో సదరు యువతి నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తాను తన ప్రేయసితోనే జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇద్దరూ చిన్నతనం నుంచే ప్రేమించుకుంటున్నట్లు చెప్పింది. పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పోలీసులు పడ్డారు.
Latest News