by సూర్య | Sat, Nov 20, 2021, 10:19 AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ ఇవ్వాలని ఆదేశించింది. వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది. విచారణ డిసెంబర్ 20కి వాయిదా పడింది.పార్లమెంటరీ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అమలాపురం న్యాయవాది వి.రమేష్చంద్ర వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపిస్తూ.. ఏపీని ఆదుకునేందుకు పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు హోదా ఇస్తామన్న కేంద్రం ఏపీ విషయంలో మాత్రం మాట నిలబెట్టుకోలేదు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. పలు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీ విషయంలో ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. విభజనతో ఏపీకి నష్టం వాటిల్లిందని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తరఫున ఏఎస్జీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, ఏపీకి భౌగోళిక పరిస్థితులలో తేడా ఉందన్నారు. ఆ వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Latest News