by సూర్య | Thu, Nov 18, 2021, 04:34 PM
తిరుపతిలో నేటి ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. దానితో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. తిరుపతితో పాటు జిల్లాలోని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కెవిబిపురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నారాయణపురం, బిఎన్. కండ్రిగ రేణిగుంట తదితర మండలాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. . ఇక తిరుమల కొండపై కూడా భారీ వర్షం పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గ్రహించి టీటీడీ..కాలినడక మార్గం క్లోజ్ చేసింది. ఘాట్ రోడ్ లో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు తిరుపతి బస్టాండ్ నీట మునిగింది. వర్షాల కారణంగా పలు బస్సులు బస్టాండ్ కే పరిమితమయ్యాయి. భారీ వర్షాల కారణంగా గాల్లో ఓ గంట పాటు విమానాలు చక్కర్లు కొట్టాయి. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.30 గంటలకు ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానం A1542(A321) ఆకాశంలో చక్కర్లు కొట్టి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యింది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.40 గంటకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో విమానం 6E2005(A22N) కూడా చక్కర్లు కొట్టి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది. ఈ బారి వర్షాల కారణంగాఈ విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Latest News