by సూర్య | Sun, Oct 24, 2021, 01:49 PM
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికుల అభివృద్ధి సంస్థ చొరవతో అంతర్జాతీయ గుర్తింపును సాధించిన 'తమిళ చేనేత' పట్టుచీరల అమ్మకాలను, రేషన్షాపులలో తాటిబెల్లం విక్రయాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయంలో శనివారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పట్టుచీరలకు ప్రసిద్ధి గాంచిన కాంచీపురం, ఆరణి తదితర నగరాలకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన పట్టు చీరల అమ్మకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పట్టుచీరలను 'తమిళ్తరి' (తమిళ చేనేత) పేరుతో ఆయన ఆవిష్కరించారు.
ఆ మేరకు దీపావళి పండుగ సందర్భంగా కో-ఆప్టెక్స్, ఖాదీక్రాఫ్ట్ తదితర దుకాణాల్లో విక్రయించనున్నట్టు పట్టు చీరల రకాలను కూడా ఆయన ప్రకటించారు. 100 డిజైన్లలో కంచిపట్టు చీరలు, 25 డిజైన్లలో ఆరణి పట్టుచీరలు, 50 డిజైన్లలో తిరుభువనం పట్టుచీరలు, 200 డిజైన్లలో కోయంబత్తూరు- సేలం పట్టుచీరలు, 75 డిజైన్లలో చిన్నాలపట్టు పట్టు, కాటన్ చీరలు, 80 డిజైన్లలో దిండుగల్-పరమకుడి పట్టుచీరలు, కంచిపట్టు ఓణీలను ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. చిన్నారులకు ఆర్గానిక్ దుస్తులు, యువతీయువకులకు ప్యాషన్ దుస్తుల అమ్మకాలను కూడా ఆయన ప్రారంభించారు. ఇదేవిధంగా రేషన్షాపులలో 'కర్పగం' పేరుతో తాటిబెల్లం విక్రయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ తాటిబెల్లాన్ని సాధారణ దుకాణాల్లో 'కరుమ్పణై' పేరుతో విక్రయించనున్నట్టు స్టాలిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామో అన్బరసన్, ఆర్ గాంధీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, చేనేత హస్తకళాభివృద్ధి శాఖ, ఖాధీ బోర్డు, కో-ఆపెక్ట్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News