by సూర్య | Thu, Jun 10, 2021, 11:02 AM
డీఎస్సీ-2008 ఉత్తీర్ణులైన అభ్యర్థుల పదమూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. వారికి మినిమమ్ టైం స్కేల్ "ఎంటీఎస్" ఇచ్చి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా సీఎంను కలిసి డీఎస్సీ అభ్యర్థుల సమస్యను వివరించారు. స్పందించిన సీఎం.. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో 2,193 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ-2008 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను సీఎం జగన్ మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
రెండు, మూడు రోజుల్లో నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. డీఎస్సీ-2008 అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం లేదన్నారు. అందుకే వారికి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత శాఖాపరమైన పరీక్షల్లో పాసైన వారందకీ ప్రొబేషన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కమిటీ పరిశీలనలో ఉందన్నారు.
Latest News