by సూర్య | Wed, Jan 20, 2021, 08:52 AM
చిన్నమ్మ శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తిచేసుకుని ఈనెల 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్నారు. శశికళపై పళనిస్వామి, పన్నీర్సెల్వం నాయకత్వంలోని అన్నాడిఎంకె బహిష్కరణ వేటువేసింది. జైలు నుంచి శశికళ బయటకు రాగానే పార్టీలో చేర్చుకోవడం ద్వారా సామరస్యంగా ముందుకెళ్లే అవకాశాలు లేకపోలేదని, పార్టీపై ప్రతీకారణ ధోరణికి పాల్పడగలదని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలను మంగళవారం ఢిల్లీలో కలిసిన అనంతరం సిఎం పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. శశికళ జైలు విడుదల పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదని, ఆమె పార్టీలో చేరే అవకాశాలు వందశాతం లేవని అన్నారు. శశికళను చేర్చుకోరాదని పార్టీలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాంమని చెప్పారు. శశికళ జైలు నుంచి విడుదలకాగానే అన్నాడిఎంకెను స్వాదీనం చేసుకుంటారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు 22న పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. మెరీనాబీచ్లో నిర్మాణం పూర్తిచేసుకున్న జయలలిత స్మారక మండపాన్ని 27న మోడీ ఆవిష్కరిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.
Latest News