by సూర్య | Tue, Jan 19, 2021, 05:31 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలలు నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిల మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. గత విచారణలో వైఎస్ విజయమ్మకు, షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లలో కోర్టు పేర్కొంది.
ఈ కేసులో ఏ1గా విజయమ్మ, ఏ2గా షర్మిల ఉన్నారు. ఇదే కేసులో కొండా సురేఖ దంపతులు నిందితులుగా ఉన్నారు. కానీ వారిద్దరు కోర్టుకు హాజరుకాలేదు. కొంత సమయం ఇస్తే హాజరవుతామని కొండ సురేఖ దంపతులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ నెల 27న కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరకాల పోలీసులు కోర్టు ఎదుట ఉంచారు.