by సూర్య | Wed, Oct 07, 2020, 01:56 PM
ధర్నాలు, ఆందోళనల కోసం బహిరంగ ప్రదేశాలను అక్రమించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి నిరసనలు, ఆందోళనలు కేవలం నిర్థేశిత ప్రాంతాల్లోనే జరగాలని.. అలాంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అభిప్రాయపడింది. అయితే.. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్ బాగ్ లో రహదారిపై దాదాపు మూడు నెలలపాటు నిరంతరాయంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే దీనిపై అమిత్ సాహ్ని అనే వ్యక్తి వేసిన పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారించి ఈ విధంగా తీర్పునిచ్చింది. నిరసనలు ప్రజాస్వామ్యబద్దంగా చేయవచ్చని.. కానీ షహీన్ బాగ్ లాంటి నిరసన ఆమోదయోగ్యం కాదంటూ ధర్మాసనం పేర్కొంది. ఇలాంటప్పుడు పరిపాలన అధికారులే చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.
అయితే నిరసనల కోసం బహిరంగా ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించడం సరికాదని.. షహీన్ బాగే కాదు.. ఎక్కడైనా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. ఆ అడ్డంకులను తొలగించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ప్రజల రాకపోకలను సాగించే హక్కును నిరవధికంగా ఆపలేం. నిరసన తెలిపే హక్కు కచ్చితంగా ఉంటుంది. కానీ..కర్తవ్యాలను కూడా సమానంగా పాటించాలి.. అంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ కృష్ణ మురారీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిరసన ప్రదేశాల నుంచి ఆందోళనకారులను తొలగించేందుకు కోర్టు ఆదేశాల కోసం అధికారులు వేచి చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
Latest News