by సూర్య | Tue, Feb 11, 2020, 04:21 PM
ఓవల్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో కివీస్ విజయబావుటా ఎగురవేసింది. ఇప్పటికే 2 వన్డే మ్యాచులు ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న టీమిండియా మూడో మ్యాచులో ఓటమి పాలైంది. దీంతో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్ చివరి బంతికే కివీస్ బౌలర్ జెమిసన్ షాకిచ్చాడు. ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్నెట్ బౌలింగ్లో జెమిసన్కు క్యాచ్గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 7వ ఓవర్ నాలుగో బంతికే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్హోమ్ బౌలింగ్లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీతో రాణించారు. మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ చెరో 8 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్కు చెరో వికెట్ దక్కింది.
Latest News