by సూర్య | Thu, Jan 16, 2020, 04:51 PM
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై కౌంట్ డౌన్ మొదలైంది. రాజధానుల విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజధాని ఏపిసోడ్ కు తెరదించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 17న హైపవర్ కమిటీ చివరి సమావేశం జరగనుంది. 18న హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక సమర్పించనుంది. 20వ తేదిన కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేయనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణల పేరుతో అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ఈ బిల్లులపై అసెంబ్లీలో రెండ్రోజుల పాటు చర్చిస్తారు. ఆ తర్వాత రాజధాని మార్పుపై ప్రభుత్వ ప్రకటన వెలువడనుంది. రాజధానుల విభజన ప్రక్రియ ఈ నెలాఖరులోపే పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సెషన్స్ లో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత శాసనమండలిలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఇక్కడి నుంచే జగన్ మాస్టర్ ఫ్లాన్ అమలు చేయబోతున్నారు. ఆసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న జగన్ ప్రభుత్వానికి శాసనమండలిలో తగినంత సంఖ్యాబలం లేకపోవడం విపక్షాలకు కలిసి వస్తోంది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న టీడీపీ ఈ బిల్లును మండలిలో అడ్డుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆసెంబ్లీ పంపిన బిల్లును కౌన్సిల్ ఆమోదిస్తే సరేసరి.. లేదంటే ముఖ్యమంత్రి జగన్ ఫ్లాన్ బీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తే.. మరుసటి రోజే అసెంబ్లీలో రాజధాని బిల్లును మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం.. తిరిగి శాసనమండలికి మళ్లీ పంపాలన్నది జగన్ వ్యూహాంగా కనిపిస్తోంది. రెండోసారి ఆసెంబ్లీ నుంచి వచ్చిన వికేంద్రీకరణ బిల్లును మండలి ఆమోదించక తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిపబ్లిక్ డే లోపే అసెంబ్లీతో పాటు శాసనమండలిలో కూడ మూడు రాజధానుల బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News