by సూర్య | Sun, Oct 13, 2019, 04:06 PM
పూణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ను ముగించి సిరీస్ ను గెలుచుకుంది. టీమిండియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 601 - 5 పరుగులకు డిక్లేర్ చేస్తే దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌటైంది. మహారాజ్, ఫిలాండర్ రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేసింది. కానీ స్కోర్ భారీగా తేడా ఉండడంతో సఫారీలను ఫాలోఆన్ కు ఆహ్వానించాడు కోహ్లీ. సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన సఫారీలకు ఇషాంత్ మొదటి ఓవర్ లోనే షాక్ ఇచ్చాడు. వరుసగా విఫలమవుతున్న మర్క్రం వికెట్ తీసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. తరువాత వచ్చిన సఫారీ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు వరుస క్యూ కట్టారు. భారత బౌలర్ల ముందు తేలిపోయారు. ఆ తర్వాత డిబ్రుయిన్ (8), డుప్లెసిస్ (5), డికాక్ (5) లు వెనువెంటనే ఔట్ అయ్యారు. ఓపెనర్ ఎల్గర్ భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ... 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బవుమా రాణించినప్పటికీ 38 పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ను జడేజా ముగించాడు. తరువాత ముత్తుసామీ కూడా షమీ బౌలింగ్ లో 9 పరుగుల వద్ద రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మరోసారి ఫిలాండర్, మహారాజ్ కొద్దిసేపు పోరాడారు. 50 పరుగుల పార్టనర్ షిప్ తో ఆకట్టుకున్నారు. టీ బ్రేక్ తరువాత 37 పరుగుల వద్ద ఉమేష్ బౌలింగ్ లో ఫిలాండర్ పెవిలియన్ బాట పట్టాడు.
స్కోర్: ఫస్ట్ ఇన్నింగ్స్ భారత్: 601 - 5
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 275 సెకండ్ ఇన్నింగ్స్: 189
Latest News