by సూర్య | Sun, Oct 13, 2019, 01:41 AM
టిటిడి అనుబంధ ఆలయమైన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన నిర్వహించారు. ఉదయం 7.00 గంటలకు యాగశాల పూజ చతుష్టార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుండి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 13న ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అక్టోబరు 14న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
Latest News