by సూర్య | Thu, Mar 21, 2019, 11:28 PM
రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటేనే సాధ్యమౌతుందని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని షబానా ఖాతూన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం ఆమె 31వ డివిజన్లోని కేఎల్ రావ్ నగర్లో పర్యటించారు. ముందుగా డివిజన్లోని జంబులాంబ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యటన ప్రారంభించారు. షబానా ఖాతూన్కు మద్దతుగా కేశినేని శ్వేత ప్రచారంలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షబానా ఖాతూన్ ఇంటింటికీ తిరుగుతూ రానున్న ఎన్నికల్లో తనతో పాటు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శ్రీనివాస్ (నాని)లను గెలిపించాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. తాను అధికారంలోకి రాగానే పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు అన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుపొందితే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Latest News