by సూర్య | Thu, Mar 21, 2019, 11:05 PM
గతవారం న్యూజిలాండ్ మసీదులో ఒక జాతి విద్వేష దురహంకారి జరిపిన కాల్పుల నేపథ్యంలో తుపాకుల వినియోగంపై సమీక్షించిన ప్రభుత్వం సెమి ఆటోమెటిక్ తో పాటు అన్ని రకాల రైఫిళ్లను నిషేధిస్తున్నామని న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందని, మున్ముందు మరిన్ని మారణాయుధాలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యూజిలాండ్ లో ప్రస్తుతం 1.2 మిలియన్ల తుపాకులను పౌరులు వినియోగిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరి వద్ద తుపాకులు ఉన్నాయి. ప్రభుత్వం బై బ్యాక్ పథకం కోసం సుమారు 200 మిలియన్ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుందని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
నిషేధిత ఆయుధాలను వినియోగిస్తున్నవారు ప్రభుత్వానికి అప్పజెప్పాలని, ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. నిషేధించిన వాటిని బహిరంగ మార్కెట్ లో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల అనుమతితోనే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాని జసిండా తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ సైతం మద్దతు పలికింది.