ఏపీలో మరో కొత్త రైల్వే లైన్,,,తగ్గనున్న ప్రయాణ సమయం

by సూర్య | Fri, Jul 26, 2024, 08:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌ మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్రంం ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది.. ఈ కొత్త లైన్‌కు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. ఈ నూతన రైలు మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరగబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు.


2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈ లైన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. ఈ కొత్త లైన్ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా అవుతుందంటున్నారు. ఇప్పటికే నరసాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, విజయవాడ, గుంటూరు, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్, నాగర్‌సోల్‌, బెంగళూరు, హుబ్లికి రాకపోకలు జరుగుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలవాసులు స్వాగతిస్తున్నారు. ఈ లైన్‌కు సంబంధించి త్వరలోనే సర్వే కూడా నిర్వహించబోతున్నారు.


బ్రిటిష్‌ హయాంలోనే మచిలీపట్నం-నరసాపురం మార్గాన్ని రైల్వే రూట్‌లో కలపాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో 69 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌కు పలుచోట్ల ఉప్పుటేర్లపై వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.. అందుకే భారీగా వ్యయం అవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదన పెండింగ్ పడింది. ప్రస్తుతం రైలులో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ వెళ్లి అక్కడి నుంచి రైలు మారాల్సి వస్తోంది. అదే నరసాపురం నుంచి మచిలీపట్నం రైలు మార్గం కనుక పూర్తి చేస్తే.. మొగల్తూరు, బంటుమిల్లి మీదుగా వెళ్లిపోవచ్చు.. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అంతేకాదు ఈ కొత్త మార్గంతో కోస్తా తీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుంది. కోటిపల్లి రైల్వేలైన్‌ వల్ల ఇప్పటికే కాకినాడ నుంచి నరసాపురం వరకు రైలు మార్గం వచ్చిన సంగతి తెలిసిందే.. ఇటు మచిలీపట్నం పూర్తిచేస్తే సముద్ర తీరం వెంబడి రైళ్లు పరుగులపెట్టనున్నాయి. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో సర్వే పనులు మొదలుపెట్టనున్నారు.


మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వినియోగించి ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచుతామంటున్నారు అధికారులు. ఈ కొత్త రైల్వేలైన్‌ 51 కిలోమీటర్ల మేర చేపడుతుండగా.. కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలుకు రైలు మార్గం అందుబాటులోకి రానుంది. అలాగే విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్‌లైన్‌లో ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గుతుంది అంటున్నారు. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌లో మూడు భారీ బ్రిడ్జిల నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. భూసేకరణ కూడా 75 శాతం పూర్తికాగా.. నిధులు పూర్తి స్థాయిలో ఉంటే ట్రాక్‌ పనులు వేగవంతం కానున్నాయి.


Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM