తిరుపతి ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. ఆ రెండు ఎయిర్‌పోర్ట్‌లకు కూడా

by సూర్య | Fri, Jul 26, 2024, 08:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి (రేణిగుంట) ఎయిర్‌పోర్ట్‌ పేరును  శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌.. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో మరో రెండు ఎయిర్‌పోర్టుల పేర్లను సూచిస్తూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విజయవాడకు నందమూరి తారక రామారావు, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు.


 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ అన్నారు. దర్చంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్‌ కోరిందని చెప్పారు.. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నట్లు లోక్‌సభలో వివరాలను ప్రస్తావించారు. మరి ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


మరోవైపు విజయవాడ ఎయిర్‌పోర్టులో వచ్చే ఏడాది జూన్‌కల్లా కొత్త టెర్మినల్‌ భవనం, దాని అనుబంధ పనులు పూర్తవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. 2022 నాటికే పూర్తి కావాల్సిన ఈ పనులు ఇప్పటివరకు ఎందుకు పూర్తికాలేదని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న అడిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సమాధానం ఇచ్చారు.


2020 మార్చిలో రూ. 611.80 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు పీఐబీ (పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు) ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం అదే ఏడాది జూన్‌లో ఆమోదముద్ర వేసిందని.. ఈ ఏడాది జూన్‌ నాటికి 48.5% పనులు జరిగాయని తెలిపారు. రూ. 279.93 కోట్లు ఖర్చు చేయగా.. ఇసుక, ఇతర నిర్మాణ వస్తువుల లభ్యత లేకపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయన్నారు. వెంటనే ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి 2025 జూన్‌కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాదు విజయవాడ నుంచి కోల్‌కతా, వారణాసి, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, ఢిల్లీ నుంచి విశాఖ, విజయవాడలకు విమాన సర్వీసులు నడపాలని ఎంపీ బాలశౌరి కోరగా.. ఈ అంశంలో తమ శాఖ ప్రమేయం ఉండదని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.


కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్‌ పథకం కింద వేలానికి ఏపీలో బొబ్బిలి, దొనకొండ, ఏలూరు ఎయిర్‌ స్ట్రిప్స్‌ అందుబాటులో ఉన్నట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలియజేశారు. బాపట్ల టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏపీకి మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు మంజూరుచేస్తే.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు 2021 మార్చి నుంచే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయన్నారు. రూ.293 కోట్లతో దగదర్తి ఎయిర్‌పోర్టును మంజూరు చేసినట్లు తెలిపారు. విస్తారా విమాన టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులపై డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. టికెట్ల బుకింగ్‌లో తరచూ లోపం జరుగుతోందని.. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు ఒక ధర, బుకింగ్‌ తర్వాత మరో ధర వస్తోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా.. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని మంత్రి రామ్మోహన్‌నాయుడికి సూచించారు.


Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM