by సూర్య | Thu, Apr 25, 2024, 06:56 PM
ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు... ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా... ఏపీలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. అలాగే తెలంగాణలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా.. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగనుంది.
Latest News