by సూర్య | Thu, Apr 25, 2024, 04:46 PM
ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ (నిఘా విభాగాధిపతి)గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుదవారం అర్థరాత్రి రాష్ట్ర సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారు గురువారం ఉదయం విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో ఈ ఇద్దరిని నియమించింది. జగన్ సర్కారుకు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. జగన్కు కళ్లు, చెవులుగా పనిచేస్తోన్న ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాను ఎన్నికలతో సంబంధంలేని విధులకు బదిలీ చేయాలని మంగళవారం ఆదేశించింది. వీరిద్దరి స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం... ముగ్గురేసి పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు జాబితా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించింది. వీరిద్దరూ సత్వరం తమ కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి... రిలీవ్ కావాలని ఆదేశించింది. కోడ్ వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్లు, ముగ్గురు ఐఏఎస్లను పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... మరో ఇద్దరు ఐపీఎస్లపై బదిలీ వేటు వేయడం, అందులోనూ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులునే పక్కన పెట్టడం జగన్కు పెద్ద షాక్ అని ఐపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. పీఎస్సార్, కాంతిరాణాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, వారిపై ఆరోపణలను ధ్రువీకరించుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Latest News