by సూర్య | Fri, Apr 12, 2024, 02:53 PM
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే అజెండాగా వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని నెల్లూరు పార్లమెంట్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు నైజం, ఎజెండా అని ధ్వజమెత్తారు. కందుకూరు టౌన్ వాసవి నగర్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వైయస్ జగన్ గారి పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మరోసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యంకాని విధంగా కేవలం నాలుగున్నరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని సీఎం వైయస్ జగన్ అభివృద్ధి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి సంక్షేమ పాలనను కొనసాగించుకుందామన్నారు. ప్రతిపేదవాడికి మరింతగా సంక్షేమం ఎలా అందించాలన్న తపన జగనన్నదైతే, ఓట్లు, సీట్ల కోసం ప్రజలకు ఎలాంటి మాయమాటలు చెప్పాలి, ఎలా నమ్మించి మోసగించాలని చూసే ప్రజాద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు.
Latest News