అలా నాటి గుర్తుగా...ఈ రైల్వే టిక్కెట్

by సూర్య | Wed, Jan 25, 2023, 11:43 PM

కొన్ని గుర్తులు ఎపుడూ మధురానుభూతిని అందిస్తాయి. అలాంటి ఓ అనుభూతి గురించి తాజాగా చర్చసాగుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య నేడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నేడు మూగబోయింది. అయితే, స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చేందుకు ఓ ప్రయాణానికి సంబంధించిన ‘పాత టికెట్’ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘ఇది కేవలం కాగితపు ముక్క కాదు, బంగారం కంటే విలువైంది’ అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రావల్పిండి నుంచి అమృత్‌సర్ వచ్చేందుకు 1947 సెప్టెంబర్ 17న తీసుకున్న టికెట్ అది. ఒక్కో వ్యక్తికి టికెట్ ఛార్జీ 4 రూపాయల 1 అణా. మొత్తం తొమ్మిది మందికి టిక్కెట్టు ధర 36 రూపాయల 9 అణాలు. ఓ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన ఈ టికెట్ వైరల్ అవుతోంది.


బహుశా ఒక కుటుంబం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉండవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూసి కొంత మంది దేశ విభజన సమయం నాటి భావోద్వేగ ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ‘గతానికి సంబంధించిన ఓ మధురమైన జ్ఞాపకం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


‘చాలా మంచి సేకరణ. ఇప్పుడు దీని విలువ వెలకట్టలేనిది’ అని మరో యూజర్ రాసుకొచ్చారు. ‘ఇది కేవలం కాగితం ముక్క కాదు. దయచేసి లామినేట్ చేయండి. ఇది బంగారం లాంటిది’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘1949లో మా నాన్న కొనుగోలు చేసిన ఉషా స్వింగ్ ఫ్యాన్‌కు సంబంధించిన ఒక క్యాష్ మెమో ఇప్పటికీ నా వద్ద ఉంది. భద్రంగా దాచుకున్నా’ అంటూ మరో యూజర్ వెల్లడించారు. ‘అద్భుతమైనది. గట్టి కార్బన్ కాపీ. 75 ఏళ్లు గడిచినా వాడిపోలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్..’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఆ సమయంలో టికెట్ ధరపై కొంత మంది చర్చ లేవనెత్తారు. ‘ఆ సమయానికి టికెట్ ధర చాలా ఖరీదైనది. 36 రూపాయల 9 అణాలు అంటే చాలా పెద్ద మొత్తం’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు. ‘ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే నాడు కూలీ చేసుకునే ఓ వ్యక్తి రోజంతా చెమట చిందిస్తే 15 పైసలు వచ్చేవి. రావల్పిండి నుంచి అమృత్‌సర్‌కు ఒక సామాన్యుడు వెళ్లాలంటే ఎంత భారం?’ అని మరో యూజర్ కామెంట్ చేశారు.


ప్రపంచంలో సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది. భౌగోళిక హద్దులను కూడా చెరిపేస్తోంది. ఇదే సమయంలో కొన్ని దేశాల మధ్య వైరం కూడా ముదురుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్యన నేడు అలాంటి వైరమే ఉన్నా, దేశ విభజన నాటి పరిస్థితులు గుర్తు చేస్తే.. భావోద్వేగానికి గురయ్యే వాళ్లు ఎంతో మంది ఇరుదేశాల్లోనూ ఉన్నారు. ఒకే తల్లి బిడ్డలుగా నాడు కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకొని కన్నీళ్లు చెమర్చుతారు. కాలం కరిగిపోయినా, ఎంతో మందికి అదొక మర్చిపోలేని అనుభవం. ఆ మధుర జ్ఞాపకాలకు సంబంధించి ఏ చిన్న ఆధారం ఉన్నా, అది ‘బంగారమే’. అదొక కాగితపు ముక్క కావొచ్చు. లేకపోతే చిన్న రాయి కావొచ్చు. మాటల్లో చెప్పలేని భావోద్వేగం..!


Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM