వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు

by సూర్య | Thu, Apr 25, 2024, 07:10 PM

కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు నామినేషన్‌లో అపశృతి జరిగింది. అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సింహాద్రి రమేష్‌బాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో కాల్చిన టపాసుల వల్ల నాలుగో వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు, ఆయన పెదనాన్న శ్రీనివాసరావులకు చెందిన రెండు పోర్షన్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. యాసం శ్రీనివాసరావు, ఆయన భార్య ఇటీవల చనిపోగా వారి పోర్షన్లో ఎవరూ ఉండడం లేదు. మరో పోర్షన్లో వెంకటేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. మంటలు రేగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.


ఈ ఘటనలో రూ.6 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు చెబుతున్నారు. ఇంట్లో ఫ్రిజ్‌, చెక్క బీరువా, అందులోని 50 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, టీవీ, ఇతర ఫర్నిచర్‌, ఇంటి పత్రాలు కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం ఉంచిన టేకు కలప, రూ.2 లక్షలతో కొనుగోలు చేసి తెచ్చిన గ్రానైట్‌ రాళ్లు, టైల్స్‌ కాలిపోయినట్లు బాధితుడు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఏడాదిన్నర నుంచి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్త వెంకటేశ్వరరావు ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌‌సీపీ నేతల ప్రోద్బలంతో స్థానిక అధికారులు గతంలో తమ ఇంటి స్థలం ప్రభుత్వానిదంటూ మరుగుదొడ్లను పగలగొట్టి, గుడిసెను తొలగించారని చెబుతున్నారు.


ఆ వెంటనే తాను హైకోర్టులో స్టే తెచ్చుకున్నానని.. కొద్ది రోజుల తర్వాత స్టే ఎత్తివేశారన్నారు. మరోసారి తమ స్థలంలో రోడ్డు వేసే ప్రయత్నం చేశారన్నారు. దీంతో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశామని.. అప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు మరింత కక్ష పెంచుకున్నాట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమ ఇంటిపై కావాలని టపాసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే రమేష్‌బాబు అనుచరులు దారుణంగా హింసించారని జనసేన పార్టీ అవనిగడ్డ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


అవనిగడ్డలో అగ్నిమాపక కేంద్రం నుంచి ఈ ఇల్లు కిలోమీటరు దూరంలో ఉంది. అయితే ఈ ఇంటికి నిప్పు అంటుకోగానే మోపిదేవి మండలం, బొబ్బర్లంకలో కరకట్ట ప్రక్కన చెత్త తగలబడుతుంది అని ఫోన్ రావడం ఫైర్ వాహనం వెళ్లటం.. మరో ఐదు నిమిషాల్లో ఫైర్ వాహనం తిరిగిరావడం ఇదంతా చూసిన వారికి ఏమి జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Latest News

 
అర్హులైన ప్రతిఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందుతాయి Wed, May 08, 2024, 01:36 PM
గంజాయి విచ్చలవిడైపోయింది Wed, May 08, 2024, 01:25 PM
రైతులు ఆలోచించవలసిన అవసరం వచ్చింది Wed, May 08, 2024, 01:24 PM
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా Wed, May 08, 2024, 01:23 PM
అవినీతికి పాల్పడి ఉంటే ఏ విచారణకైనా సిద్ధం? Wed, May 08, 2024, 01:23 PM