ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

byసూర్య | Mon, Jan 19, 2026, 09:36 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా.. విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే లక్ష్యంతో ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు ఒక చిన్న విద్యుత్ కేంద్రంగా మారి.. కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది.


ఈ పథకం యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే.. ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల ద్వారా తయారయ్యే విద్యుత్తును వాడుకున్న తర్వాత.. మిగిలిన దానిని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ఒక సాధారణ కుటుంబం తమ ఇంటి అవసరాలకు పోను.. సంవత్సరానికి సుమారు 1,086 యూనిట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని అంచనా. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం (యూనిట్‌కు రూ.2.57).. ఈ అదనపు విద్యుత్తును విద్యుత్ సంస్థలకు విక్రయించడం ద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు నేరుగా ఆదాయం పొందవచ్చు. ఆదాయంతో పాటు, నెలకు వచ్చే కరెంటు బిల్లు పూర్తిగా తప్పుతుంది. దీనివల్ల సంవత్సరానికి మరో రూ. 14,000 వరకు ఆదా అవుతుంది. అంటే ఆదాయం.. ఆదా కలిపి ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడనుంది.


 రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 81 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ. 1,380 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా.. బోనకల్లు మండలంలోని 22 గ్రామాలను పూర్తిస్థాయిలో సోలార్ గ్రామాలుగా మారుస్తున్నారు. రావినూతల గ్రామం ఒక్కదానికే రూ. 24 కోట్లు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఈ ప్రాజెక్టు ముమ్మరంగా సాగుతోంది.


వ్యవసాయ రంగానికి ఈ పథకం వరప్రసాదంగా మారనుంది. రైతులు తమ పొలాల్లోని పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని వల్ల పగటిపూట నిరంతరాయంగా ఉచిత సోలార్ విద్యుత్ అందుతుంది. పంటలు లేని సమయంలో లేదా మోటార్లు వాడని రోజుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానించి ఆదాయం పొందవచ్చు. సోలార్ ప్యానళ్ల కింద ఏర్పాటు చేసే షెడ్లను పశువుల పాకగా లేదా వ్యవసాయ పనిముట్ల గదిగా వాడుకోవచ్చు.


ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు.. ఇతర ప్రభుత్వ భవనాలపై కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతుంది. మహిళలు ఈ పథకాన్ని అందిపుచ్చుకుని.. విద్యుత్ పొదుపు ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.



Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM