|
|
byసూర్య | Wed, Nov 12, 2025, 07:37 PM
తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మోనో రైలు ప్రాజెక్టు, దాన్ని అనుసంధానించేలా స్కైవాక్ల నిర్మాణాల ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 72 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను నిర్మించారు. అయినా హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఎయిర్పోర్టుకు సరైన కనెక్టివిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ మార్గాల్లో మోనో రైలు నిర్మించే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో 2018లో అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్.. గురుగ్రామ్ మోడల్ మాదిరిగా ఐటీ కారిడార్లో మోనో రైలు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే విషయంపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. అయితే అప్పటి నుంచి ఈ మోనోరైలు ప్రాజెక్టు ముందుకు కలదల్లేదు.
పీపీపీ మోడ్లో మోనోరైలు..
2023లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశపై దృష్టి పెట్టింది. వచ్చే మూడేళ్లలో మెట్రో రైలు రెండో దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మెట్రో రెండో దశ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మోనోరైలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. మోనోరైల్ ప్రాజెక్ట్ కోసం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) మోడ్ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. వీటికి అనుబంధంగా నిర్మించే స్కైవాక్లకు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు వాడుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్కైవాక్లు వాణిజ్య భవనాల మీదుగా లేదా వాటికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్నందున.. ఆ భవనాల యజమానుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐటీ కారిడార్లోని ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించినట్లు ప్రభుత్వం వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ మోనో రైలు ప్రాజెక్టుపై స్పష్టత వస్తుంది. కాగా, ఐటీ కారిడార్కు మోనోరైలు వస్తే హైటెక్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం ఉంది. దీని ద్వారా ఐటీ ఉద్యోగులకు కూడా ఉపశమనం లభిస్తుంది.