|
|
byసూర్య | Wed, Oct 08, 2025, 06:12 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆయన కీలక నేతలతో సమావేశమయ్యారు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలంటూ తెలంగాణ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం, రాష్ట్ర, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం వంటి సంస్థాగత అంశాలపై చర్చించారు. ఇప్పటికే మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని, దానిని వెంటనే పూర్తి చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, తెలంగాణలో పార్టీకి 1.78 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయినట్లు నేతలు చంద్రబాబుకు వివరించారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, సరైన నాయకత్వం అందిస్తే పార్టీని మళ్లీ క్రియాశీలంగా మార్చవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమైతే, తాత్కాలికంగా ముఖ్య నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా వారు సూచించారు.నేతల అభిప్రాయాలను పూర్తిగా విన్న చంద్రబాబు, పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి చేసి, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకుడికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ సమావేశంలో పార్టీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని, ఆశోక్ గౌడ్, జోత్స్న, వాసిరెడ్డి రామనాథం, పొగాకు జైరామ్ తో పాటు పలువురు హాజరయ్యారు