|
|
byసూర్య | Mon, Feb 17, 2025, 09:02 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అనుమతుల్లేకుండా ఒకరు.. అనుమతుల పేరుతో మరికొందరు పట్టపగలే సహజవనరులను దోచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి, బీర్కూర్ తదితర మండలాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ మండలాల్లో ప్రవహించే మంజీరా నది ఒడ్డున నుంచి నిర్విరామంగా ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇక్కడ నుంచి జహీరాబాద్, బీదర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు లారీల ద్వారా అదేవిధంగా దగ్గరి ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని నెలలుగా ఇసుక దందా మూడు ‘పువ్వులు.. ఆరు కాయలు’గా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా మొదలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నది ఒడ్డున పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ అక్రమార్కులకు మాటలతో మాయా అదేవిధంగా చేతులతో ఛాయా చూపించే ఓ కొత్త హస్తం వెనకేసుకు వస్తోందని అధికార పార్టీకి చెందిన వారే గుసగుసలాడుకోవడం విడ్డూరంగా ఉంది.
గ్రామ, మండల స్థాయిలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇసుక రవాణాలో భాగస్వాములవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పర్మిషన్ లేకున్నా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నిస్తే, అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్, అదేవిధంగా మైనింగ్ ఏడీ గట్టి చర్యలు తీసుకుంటున్నా అక్రమ ఇసుక రవాణా మాత్రం నిలువరించలేకపోతున్నారు. గత వారంలో అక్రమార్కులు రెవెన్యూ శాఖ సిబ్బందిపై దాడులు చేసి జారుకున్నా సందర్భాలు ఉన్నాయి. స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఉత్తుత్తి చర్యలు తీసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా రెవెన్యూ పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కొసమెరుపు. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. కాగా కేవలం 5 సంవత్సరాల పాటు ఉండే రాజకీయ నేతల మాటలు విని మేం సతమతమవుతున్నామని ప్రభుత్వ అధికారులు గుసగుసలాడుకోవడం గమనార్హం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొవడం మంచిదేనని సామాన్య ప్రజలతో పాటు మంజీరా నది ఒడ్డున ఉన్న రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.