byసూర్య | Fri, Dec 13, 2024, 07:20 PM
రాష్ట్రంలోని వీఆర్వో వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువగా వీఆర్వో వ్యవస్థ ద్వారానే జరగుతోందని భావించిన అప్పటి సీఎం కేసీఆర్..వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్వోలుగా పని చేసిన పలువుర్ని.. వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేశారు. అప్పట్లో దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా..కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కాగా, తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్(New Recruitment) ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది వీఆర్వోలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలిసింది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమిస్తారని సమాచారం.