byసూర్య | Mon, Dec 02, 2024, 05:08 PM
హైదరాబాద్ను కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దీనికి కూడా తూట్లు పొడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్నేళ్లపాటు కేబినెట్లో మహిళలకు చోటు కల్పించని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో సమగ్ర సర్వే చేయించి ఆ తర్వాత దానిని అటకెక్కించారని విమర్శించారు. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా? కాదా? చెప్పాలని నిలదీశారు. దామాషా పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాము బీసీ గణన చేపడుతున్నట్లు చెప్పారు.బతుకమ్మ చీరల పేరిట గత ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఆగం చేసిందన్నారు. సూరత్ నుంచి చీరలను తెచ్చి ఇచ్చారని మండిపడ్డారు. ఆ చీరలు కూడా మహిళలు కట్టుకోవడానికి ఉపయోగపడలేదని... పంటచేలలో బెదురు పెట్టేందుకు ఉపయోగపడ్డాయని విమర్శించారు. ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం కేసీఆర్దే అన్నారు. గ్రూప్-1 పేపర్లు లీక్ చేసిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సినిమాకు శుభం కార్డు పడిందని చురక అంటించారు.