byసూర్య | Mon, Dec 02, 2024, 12:26 PM
కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇప్పటికే బీజేపీ చార్జ్షీట్ను విడుదల చేసింది. ప్రజాపాలన అంటూ జనాన్ని అబద్ధపు హామీలతో ప్రభుత్వం మభ్యపెడుతోందని..ఆ పార్టీ ముఖ్య నాయకులు సీఎం , మంత్రుల పై ఇటీవల వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల్లో సీఎం రేవంత్రెడ్డి , కేసీఆర్ ను మించిపోయాడని కామెంట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు. రైతు భరోసా తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 సాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలమూరు నిధుల కోసం మంత్రులను సీఎం అడుక్కున్నట్లుగా ఉందని డీకే అరుణ ఎద్దేవా చేశారు.