byసూర్య | Sun, Sep 29, 2024, 06:21 PM
మూసీ సుందరీకరణ, హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని అన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ నేతలు ఇవాళ హైదర్షాకోట్లో ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీ ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం వచ్చి రక్షణ కవచంలా నిలబడతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. బుల్డోజర్లు వస్తే ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప, మీ ఇళ్లను తాకే ప్రశ్నే లేదు అని. భరోసా ఇచ్చారు. ఇదే మూసీ నదిపై కొత్తగా ఆరు పెద్ద పెద్ద బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారని, పేదల ఇళ్లను కూల్చివేసే రేవంత్ రెడ్డి... ఆ కొత్త భవనాలను ఎందుకు కూల్చివేయడం లేదు? అని ప్రశ్నించారు. పేదవాళ్లు నోరు లేని వాళ్లని, ఏంచేసినా ఎవరూ రారు అనుకుంటున్నావా? పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కేసీఆర్ తోడుంటాడని గుర్తించాలి అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.