హైడ్రా కమిషనర్‌పై ఎమ్మెల్యే దానం ఫైర్.. 'ఇడియట్' సినిమా డైలాగ్‌తో కౌంటర్

byసూర్య | Tue, Aug 13, 2024, 09:48 PM

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని అన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని ఆక్షేపించారు. 'అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ నేను లోకల్' అంటూ ఇడియట్‌ మూవీలో హీరో రవితేజ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. నందగిరి హిల్స్‌ హుడా లే అవుట్ ఘటనపై.. అధికారులకు తాను ప్రివిలేజ్‌ నోటీసులు ఇస్తానని అన్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని దానం నాగేందర్ వెల్లడించారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్‌లో జీహెచ్ఎంసీకి చెందిన గవర్నమెంట్ స్థలం ప్రహరీ గోడను ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. ప్రహరీ కూల్చివేతతో ప్రభుత్వానికి దాదాపుగా రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన అనుచరుల రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించే నిరోధక చట్టం (PDPP), వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పోలీసులు A3గా చేర్చారు. గతంలోనూ దానం నాగేందర్ భూకబ్జా ఫిర్యాదులు వచ్చాయి. దానం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకముందు తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీ వాసులు కొందరూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బేగంపేట ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్న పలువురి ఇళ్లను కబ్జా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగానే.. నందగిరిహిల్స్‌ గురుబ్రహ్మనగర్‌కు చేరుకున్న దానం ఆక్రమణదారులను రెచ్చగొట్టారని ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చి వేసినట్లు ఫిర్యాదులో పేర్కొనటంతో కేసులు నమోదు చేసారు.


దీంతో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన దానం నాగేందర్.. 'అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ నేను లోకల్‌. ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. హుడా లేఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే అక్కడికి వెళ్లా. కేసులు నాకు కొత్తేమి కాదు. గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారు. నందగిరి ఘటనపై అధికారులకు ప్రివిలేజ్‌ నోటిసులు పంపిస్తా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.' అంటూ దానం ఫైరయ్యారు.



Latest News
 

నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం Sun, Feb 09, 2025, 04:46 PM
కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Feb 09, 2025, 04:44 PM
బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు Sun, Feb 09, 2025, 04:42 PM
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM