కార్మికులపై ఆమ్రపాలి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలతో దిగొచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్

byసూర్య | Fri, Aug 09, 2024, 08:18 PM

డైనమిక్ ఐఏఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో.. నగరంలో పారిశుద్ధ్య నిర్వాహణపై స్పెషల్ ఫోకస్ చేసిన ఆమ్రపాలి.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సాధారణ అమ్మాయిలా.. నడుచుకుంటూ వెళ్తూ చెరువులు, నాలాల పరిస్థితులను పరిశీలిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. పారిశుద్ధ్య కార్మికులపై ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అప్పుడప్పుడు స్వయంగా తన ఇంట్లో కూడా చెత్తను సేకరించడం లేదంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.


చెత్త సేకరణపై ఇటీవల మాట్లాడిన ఆమ్రపాలి.. రోజూ చెత్త ఆటో వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన ఆవశ్యకతను వివరించారు. చెత్త సేకరించే వారు రోజూ ప్రతి ఇంటికి వచ్చి చెత్తను తీసుకోవాలని.. కానీ అలా జరగడం లేదన్నారు. కొన్నిసార్లు తమ ఇంట్లో కూడా చెత్తను తీసుకువెళ్లడానికి రావడం లేదని.. ఫలితంగా తాము ఇబ్బంది పడుతున్నామంటూ కామెంట్ చేశారు. ఆమ్మపాలి చేసిన ఈ కామెంట్లపై.. పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.


శుక్రవారం రోజున.. జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. నగర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల నిరసనతో దిగొచ్చిన ఆమ్రపాలి.. వారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆమ్రపాలి వచ్చి మాట్లాడటంతో.. కార్మికులు ఆందోళన విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమ్రపాలి.. కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వాహణలో కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.


ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజు కమిషనర్‌ జోనల్‌, అడిషనల్‌ కమిషనర్లతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించగా.. ఉన్నతాధికారులకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వరద నీటి కాలువలలో నీరు నేరుగా పోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాలో అక్కడక్కడ నీటి నిలువతో దోమల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నందున.. వెంటనే ఆయా ప్రాంతాల్లో దోమల వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని సూచించారు.


స్మార్ట్‌ వాటర్‌ డ్రైన్‌, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లలేకపోవడంతో స్టాగ్నేషన్‌ అయి దోమలు బ్రీడింగ్‌ ఎక్కువగా అవుతున్నాయని వివరించిన ఆమ్రపాలి.. వాటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఆర్‌ఎంపీ ద్వారా చేపట్టిన బీటీ రోడ్ల నిర్వహణ త్వరలో అగ్రిమెంట్‌ పూర్తికావస్తున్న నేపథ్యంలో వారు ఇంకా మిగిలిన పనులు చేయలసిన వెంటనే పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లకు ఆదేశించారు. ఫుట్‌పాత్‌లో సెంట్రల్‌ మీడియన్‌, కర్బ్‌లైన్‌, లైన్‌మార్కింగ్‌ పనులను అన్ని జోనల్‌లో పూర్తి చేయాలని కమిషనర్‌ జోనల్‌ కమిషనర్‌లను ఆమ్రపాలి ఆదేశించారు.


Latest News
 

భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి Sat, Jul 12, 2025, 06:13 AM
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM
3వేల మందికి ఆగ‌స్టు 2వ వారం నుంచి శిక్ష‌ణ: పొంగులేటి Fri, Jul 11, 2025, 08:43 PM