![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 08:09 PM
హైదరాబాద్ నుంచి ప్రస్తుతం తిరుపతి, విశాఖ, యశ్వంత్పుర ( బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు ట్రైన్లు పరుగులు పెడుతుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్పురకు ట్రైన్ నడుస్తోంది. కాగా, సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం సికింద్రాబాద్ - పుణే (మహారాష్ట్ర) మధ్య శతాబ్ది ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతోంది. దాని స్థానంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టులో ఈ ట్రైన్ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది.
కాగా, ప్రస్తుతం నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇక మహారాష్ట్ర తెలంగాణ మధ్య కూడా వేల సంఖ్యలో ప్రతినిత్యం ప్రజలు ట్రైన్ ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పుణే- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ట్రైన్ నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక హైదరాబద్ నుంచి ముంబై వరకు మెుదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా నడపనున్నారు. ఈ ట్రైన్ను ఆగస్టులో పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణలో నాల్గవ అతిపెద్దైన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైందని చెప్పారు. త్వరలోనే ప్రారంభం కానున్న చర్లపల్లి టెర్మినల్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే టెర్మినళ్లపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని ట్వీట్ చేశారు. రూ.434 కోట్లతో నిర్మించిన చర్లపల్లి స్టేషన్ 15 జతల రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ తాజా చిత్రాల్ని ఆయన తన ట్విట్టర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఈ శాటిలైట్ టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభింపజేయనున్నట్లు సమాచారం.