byసూర్య | Wed, Jun 07, 2023, 08:34 PM
బావిలో కొండ చిలువ పాగవేసింది. కానీ ప్రతిరోజూ వెళ్లినట్లుగానే.. మంచినీళ్ల కోసం స్థానిక మహిళలు బావి వద్దకు వెళ్లారు. సరదగా కబుర్లు చెప్పుకుంటూ.. బావిలో నీళ్లు తోడేందుకు బకెట్ వేశారు. నీళ్లు తోడే క్రమంలో బావిలోకి చూసిన మహిళలు.. అక్కడ కనిపించింది చూసి షాక్ గురయ్యారు. గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. భయంతో గజగజ వణికిపోయారు. ఈ షాకింగ్ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ బావిలో మహిళలకు ఏం కనిపించి ఉంటుందని ఆలోచిస్తున్నారా ? అక్కడికే వస్తున్నా..
బావిలో మహిళలకు ఓ పాము కనిపించింది. పామంటే ఓ నీటిపామో.., వానపామో కాదు. భారీ కొండ చిలువ. 12 అడుగుల పైనే ఉన్న కొండ చిలువ వారికి కనిపించింది. ఐతే అది బావిలో ఎలా పడిపోయిందో తెలియదు కానీ.. నీటిపై తేలియాడుతూ కనిపించింది. అది చూసిన మహిళల గుండెలు జారిపోయాయి. నీటి బిందెలు అక్కడే వదిలేసి భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు. విషయం గ్రామ పెద్దలకు చెప్పగా.. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చాకచక్యంగా పామును బయటకు తీసిన అధికారులు దాన్ని అడవిలో వదిలిపెట్టారు. ప్రమాదవశాత్తు అది బావిలో పడిపోయి ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు.