byసూర్య | Wed, Jun 07, 2023, 06:20 PM
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్ను ప్రతి అంగుళం అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందన్నారు. ఐటీ అన్నం పెడుతుందాని అప్పట్లో అందరూ ఎగతాళి చేశారని ఆయన గుర్తుచేశారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబుకు సన్మానం జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడుకు బుద్ధుడు విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతం కోసం బాగా పనిచేస్తున్నారని కితాబు పలికారు. హైదరాబాద్ను ఇంచ్ బై ఇంచ్ అభివృద్ధి చేశామన్న సంతృప్తి తనకుందన్నారు. తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు. ఏపీ సీఎం అభివృద్ధిని ఆపేసి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ పనిచేస్తోందన్నారు. తెలంగాణ గడ్డ మీదనే టీడీపీ పుట్టిన విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతోందని చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, టీటీడీపీ కమిటీలు పూర్తిచేయటం అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు.