తెలంగాణలో ఈ నెలలో అమిత్ షా, నడ్డా పర్యటన,,,ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశం

byసూర్య | Wed, Jun 07, 2023, 06:08 PM

తెలంగాణలో అధికారంలో పాగవేసేందుకు బీజేపీ వ్యూహాలను పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ పర్యటించనున్నారని సమాచారం. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఇటీవల ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రచారంలో భాగంగా బెంగళూరులో 21 కిలోమీటర్ల భారీ ర్యాలీ మోదీ నిర్వహించారు. అదే తరహాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ మోదీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


మోదీ పర్యటనకు సంబంధించి అధికారికంగా డేట్ ఫిక్స్ కాకపోయినా.. ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుందని టీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననుండగా.. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 25న జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు మోదీ కూడా ఈ నెలలోనే రానున్నారని చెబుతున్నారు. ఒకే నెలలో ముగ్గురు అగ్రనేతల పర్యటనలతో కాషాయదళంలో సరికొత్త ఉత్సహం నెలకొనే అవకాశముంది.


మోదీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఖమ్మం, నడ్డా నాగర్ కర్నూలులో సభలు నిర్వహిస్తుండగా.. మల్కాజ్‌గిరి పరిధిలో మోదీ భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి రేవంత్ పోటీ చేయనున్నారు. దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరికి పేరుంది. దీంతో మోదీ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.


ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోదీ, అమిత్ షా తరచూ రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. గత నెలలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రతీ నెలలో ఒకసారైనా తెలంగాణ పర్యటనకు బీజేపీ అగ్రనేతలు వస్తున్నారు. దీని వల్ల పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు నేతలను ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM