byసూర్య | Mon, Jun 05, 2023, 07:49 PM
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
పగటి పూట ఎండలు సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మరోవైపు ఏడు రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపటి నుంచి (మంగళవారం) వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో నిన్న అత్యధికంగా 45.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.