ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ఇదే లాస్ట్ ఛాన్స్,,,సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

byసూర్య | Sat, Feb 04, 2023, 12:27 AM

రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీద మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమేనని.. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారన్న రేవంత్ రెడ్డి.. తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదని లేఖలో ఎత్తి చూపారు. ప్రస్తుతం దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి... ఇంటికో ఈక అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు. ఇలా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు... బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 


పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనని.. ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60 -70 ఏళ్లకు కూడా పూర్తి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై గడిచిన తొమ్మిదేళ్లుగా ప్రజలను ఊరిస్తూనే ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమేనని.. ఇందులో 2,28,520 నిర్మాణం మొదలవగా లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమేనని పేర్కొన్నారు.


సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న హామీ ఏమైందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవని.. పథకం ప్రారంభించింది లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిలదీశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వద్ద సుమారు 26 లక్షల మంది నిరుద్యోగుల నమోదు జాబితా ఉందని.. వాళ్లలో ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదన్నారు. పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హాయంలో తెచ్చిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని అటకెక్కించారన్నారు.


రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్న హామీ ఒక బూటకమని.. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ సబ్ స్టేషన్ల ముందు ధర్నాల దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. నష్టాల భర్తీ పేరుతో గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు ఛార్జీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. "వైద్యం విషయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కొత్త వాటి సంగతి దేవుడెరుగు... ఉన్న ఆస్పత్రులు నిర్వహణకే నిధులు లేని పరిస్థితి. ప్రజలకు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది మీకు చివరి ఛాన్స్. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు." అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.


 


Latest News
 

తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే Fri, Apr 19, 2024, 07:26 PM